Friday, February 15, 2019

ఉగ్రవాదం

ఉగ్రవాదం
వీర్రాజు ఒక బిల్డర్ దగ్గర సూపరువైసరుగా పని చేస్తున్నాడు.వర్కర్లు ఎంత మంది వచ్చారు, వారు రోజు ఏమి పని చేస్తున్నారు,కూలి బట్వాడా అతని పనులు.

ఒక రెండు సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి.ఏడాది పాప. ప్రస్తుతం చేస్తున్న సైటు దగ్గరే వసతిగా ఇల్లు దొరకడముతో ఈ కొత్త ఇంటికి మారి ఆరు నెలలు అయ్యింది.

మాములుగా బాధ్యతగా ఉండి తన పని చూసుకుని ఇంట్లో భార్య పిల్లలతో కాలక్షేపం చేసేవాడు.

ఎప్పుడైనా స్నేహితులు బలవంతం మీద సారా తాగేవాడు. అటువంటివాడిలో గత నాలుగు నెలలుగా మార్పు గమనించింది అతని భార్య చంద్రిక.

అంతకుముందు అడపాదడపాగా ఉన్న అలవాటు ఇప్పుడు ఇంచుమించి రోజుగా మారింది.

రెండు నెలలుగా ఇంట్లో జీతం ఇవ్వడం లేదు.
 జాగ్రత్తగా వుండే మనిషి కాబట్టి తన దగ్గర దాచిన డబ్బుతో ఇల్లు నడుపుతోంది. కానీ జీతం ఏమి చేస్తున్నాడు అని ఒక రోజు అడిగితే ఇంకా రాలేదు అని సమాధానం చెప్పాడు.

వారం రోజుల నించి మధ్యాన్నం భోజనానికి వచ్చినప్పుడే మనిషి దగ్గర సారా వాసన వస్తోంది.
ఇంక చెప్పక్కర్లేకుండానే జీతం ఏమౌతుందో చంద్రికకు అర్ధం అయింది. నయాన నచ్చచెప్పింది..పిల్ల ఉన్నది,ఇల్లు ఒళ్ళు గుల్ల అవుతుంది.వద్దని.
నిజమే...ఇంకా తాగను అని ఒప్పుకున్నాడు వీరాజు..
కానీ షరా మాములు..మధ్యాన్నం తాగి వస్తున్నాడు.
అదేమి అంటే ఆ కల్లు కాంపౌండ్ కి వచ్చేదాకా బానే ఉంటున్నా...అక్కడికి వచ్చే సరికి కాళ్లు ఆటు వెళ్లిపోతున్నాయి అన్నాడు..

అసలు ఇంతలాగా అలవాటు ఎందుకు అయ్యింది అని నిలదీస్తే..
ఎన్నికల హడావిడిలో నెలరోజులుపాటు తాగినవాళ్ళకి తాగినంత పోయించారు నాయకులు...
అప్పుడే అది వ్యసనమై నెత్తి మీద మహమ్మరి అయ్యింది..

నెత్తి నోరు కొట్టుకు చెప్పింది...
కల్లు కాంపౌండ్ దారి కాక వేరే దారిలో వస్తానన్నాడు...జీతం ఇంటికి తెస్తానన్నాడు
నిజమని  నమ్మింది వెర్రిది..
మళ్ళీ మధ్యాహ్నం తాగివచ్చాడు..
జీతం ఏది అని అడిగింది..
సారకొట్టు వాడి బాకీ జమ వేశానన్నాడు
కోపం వచ్చింది చంద్రికకు...
పుట్టింటికి పోతా అంది...
పోతే పో..అన్నాడు
మళ్ళీ రాను అన్నది..
అక్కడే చావు అన్నాడు.
ఇక్కడే చస్తా అన్నది
చావు...బెదిరిస్తున్నవా అని ఎగతాళి చేసి మత్తుగా పడుకుండిపోయాడు వీర్రాజు..
ఆవేశం,ఉక్రోషం పట్టలేక కిరసనాయిలు పోసుకుని నిప్పు అంటించుకుంది చంద్రిక.
అప్పుడే నిద్ర లేచిన ఏడాది పాప అమ్మను వెతుక్కుంటూ వెళ్లి కాళ్ళను పట్టుకుంది...
గుర్తొచ్చిన పేగుబంధం కేకలు పెట్టింది..వీర్రాజు కి ఇంకా మత్తు వదలలేదు..
పక్కింటివారికి కేకలు వినపడి,వచ్చి  నీళ్లు గుమ్మరించేటప్పటికి పాప లేత చర్మం అంటుకుపోయింది.
ఇంకో బకెట్ నీళ్లు వీర్రాజు మీద గుమ్మస్తే మత్తుదిగింది.

వాస్తవం లోకి వచ్చేటప్పటికి పసిపాప మోర్చురీ లో,
 కోరి చేసుకున్న భార్య ఐ.సి.యూ.లో...
పోలీస్ వచ్చి ఎఫ్.ఐ.ర్. వ్రాయబోతే. స్టవ్ పేలింది అని వాంగ్మూలం ఇచ్చింది..
పిచ్చి తల్లీ...

ఈ చిచ్చు ఎవరు పెట్టింది?
ప్రభుత్వాలు తమ ఆదాయం సారకొట్లు పెట్టటము,
నాయకులు తమ ఓట్ల కోసం వీళ్ళని మత్తులో ముంచడం
జీవితాలు కొల్పుతున్నా తెలుయని నిర్భాగ్యులు...
ఇది ఏ  ఉగ్రవాదం కన్నా తక్కువ???
దేశములో జవాన్లు ప్రాణాలైనా,పేదవాడి ప్రాణాలైన నాయకుల చేతిలో బలి కావలసిందేనా???

(ఇవాళ జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా వ్రాసింది)

No comments:

Post a Comment